Padmashali Atma Gaurava Bhavan | స్వతంత్ర భారత చరిత్రలో వెనుకకునెట్టేయబడిన బీసీ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన కోకాపేట, ఉప్పల్ భగాయత్ భూములను 41 కులాలకు కేటాయించి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తుందన్నారు. మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్తో కలిసి కోకాపేటలో 2.5 ఎకరాల్లో రూ.5కోట్లతో నిర్మిస్తున్న పద్మశాలి ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ బీసీ సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, కులవృత్తులకు చేయూతనిస్తూనే బలహీనవర్గాల్లో అక్షర చైతన్యం వెల్లివిరిసేందుకు 310 బీసీ గురుకులాలను నిర్వహిస్తూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తుందన్నారు. గతంలో దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా ఒక్క రూపాయి ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ పెద్ద కొడుకుగా పేదింటి బిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మీ రూపంలో రూ.లక్ష అందిస్తున్నారని, అత్యధిక శాతం ఉన్న బీసీలకు ఆసరా పింఛన్లలో పెద్ద మొత్తం కేటాయిస్తూ ఆత్మగౌరవంతో జీవించేలా భరోసానిస్తున్నారన్నారు.
ఇలాంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ట్రస్ట్ సభ్యులు చింతా ప్రభాకర్, మచ్చ సుధాకర్, నాయకులు బొడ్ల తిరుపతి, బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.