తెలంగాణచౌక్, సెప్టెంబర్ 27: ఫక్తు రాజకీయ కుయుక్తులు పన్నుతున్న గవర్నర్ తమిళిసై బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా సామాజిక వర్గాలకు చెందిన మేధావులను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే, వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించడం శోచనీయమని అన్నారు. వెనుకబడిన వర్గాల నాయకుల పట్ల గవర్నర్ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఆమె వైఖరి కారణంగా బడుగులంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు. బలహీన వర్గాల సంక్షేమంపై ఆమెకు చిత్తశుద్ధి ఉంటే సత్వరమే వారి అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని సూచించారు. రేషన్ పంపిణీకి అవసరమైన ఈకేవైసీపై ఈ నెల 30 వరకు కేంద్రం ఇచ్చిన గడువుపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదని అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడించారు. అనేక మంది ఇతర ప్రాంతాల్లో బతుకు దెరువు కోసం పనులు చేస్తున్నారని, మరికొంత మంది విదేశాలకు వెళ్లిన దృష్ట్యా గడువులోగా ఈకేవైసీ చేయడం అసాధ్యమని కేంద్రానికి లేఖ రాసినట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందన చూసిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.