హైదరాబాద్ : వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏపీ ప్రభుత్వ పెద్దలకు సూచించారు. కరీంనగర్లో మంత్రి మీడియా సమావేశంలో మాట్డారు. మంత్రి హరీశ్రావు, కేసీఆర్ను విడుదీసేలా ఏపీ మంత్రులు అమర్నాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ దేశం కేసీఆర్ పాలన కోరుకుంటుందన్నారు.
మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలో కేసీఆర్ నాయకత్వం కావాలని ఫ్లెక్సీలు వెలిసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ సారథ్యంలోని జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ పాగా వేస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలాంటిదైతే.. కేసీఆర్ తండ్రిలాంటి వారన్నారు. తమ కుటుంబంలోంచి ఒకరిని వేరుచేసే కుట్రలు ఫలించవచ్చన్నారు. బీజేపీకి బీ టీమ్లా పని చేస్తూ.. ఎదురించే ధైర్యం లేకుండా రైతుల పొట్టకొట్టేలా మీటర్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం ఎక్కడ.. ధైర్యంగా బీజేపీని ఎదిరించిన సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు.
మా సింగరేణిలో, కరెంటులో చొరబాటేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి మార్గదర్శకంగా ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వైసీపీ జతకలిసిందని ఆరోపించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల కన్నా తెలంగాణ పథకాలు ఎలా ఆదర్శమో.. అలాగే ఏపీ విషయంలోనూ హరీశ్రావు మాట్లాడారన్న గంగుల.. దీన్ని ఎదుర్కొనే దమ్ములేకనే వ్యక్తిగత హననం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు సజ్జల ఎక్కడున్నారని ప్రశ్నించిన గంగుల.. జగన్ కుటుంబంలో ఉడుములా చేరి తల్లీ కొడుకుని.. అన్నా చెల్లెల్లను విడదీసినట్టుగా ఇక్కడ చేస్తామంటే కుదరదన్నారు.
అమరావతి నుంచి హైదరాబాద్కు వలస వస్తున్నారన్నారు. సజ్జల ఏపీ ప్రభుత్వ సలహాదారు అని.. ఆయన వాళ్లకు మూడు, నాలుగు రాజధానుల కోసం సలహాలిచ్చుకొమ్మని.. తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ చురకలంటించారు. తెలంగాణ అంటేనే బహుజనుల గడ్డ అని, బహుజనుల బంధు కేసీఆర్ అని, మా వ్యవహారాల్లో తలదూరిస్తే వదిలేదని హెచ్చరించారు. సమావేశంలో కరీంనగర్ మేయర్ సునీల్రావు, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.