Minister Gangula | కేంద్రానికి బీసీలపై ప్రేమ ఉంటే ఎందుకు నిధులు ఇవ్వరని, అసలు బీసీకి మంత్రి ఉంటే కదా? అని మంత్రి గంగుల విమర్శించారు. పీఎం మోదీ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముగ్గురు బీసీలే అని చెప్పుకుంటున్నారు తప్ప చేసిందేమీ లేదన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు దూరమైన బీసీ బిడ్డలకు మళ్లీ చదువు అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే నిధుల వరద
పారిస్తామన్నారని, నిధుల సంగతి కాదు కదా కనీసం ఎంపీ సంజయ్ ఇటు వైపు కూడా రాలేదన్నారు.
ఎన్నికల్లో ఓడిన గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ జనాల్లో ఉంటే.. గెలిచిన ఈటల, బండి సంజయ్ కనుమరుగయ్యారన్నారు. కేంద్రానికి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే మా బీసీ బిడ్డలకు నిధులు ఎందుకు ఇవ్వరు అన్నారు. అసలు బీసీకి మంత్రి ఉంటే కదా కేంద్రం ఇచ్చేదని.. మోదీ, ఈటల, బండి ముగ్గురు బీసీలే అని చెప్పుకుంటున్నారన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే బీసీ మంత్రిని, బడ్జెట్లో నిధులన్నీ
ప్రకటించాలన్నారు. అప్పటి వరకు వారు బీసీ ద్రోహులుగానే మిగిలిపోతారన్నారు. ఈ బడ్జెట్లో బీసీ మంత్రిని ప్రకటించాలని బడ్జెట్లో డిమాండ్ చేయకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ సత్తా చాటుతామన్నారు.