కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 11 : తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు తమకు కూడా అలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని కోరుకొంటున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎనిమిదేండ్ల కాలంలోనే రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి సాధించటం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయిందన్నారు. అందుకోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్నదన్నారు. ఆదివారం కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా, సాగుకు నీటి వసతులు కల్పించడం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. అనేక రాష్ర్టాల ప్రతినిధులు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని స్వయంగా చూసి మెచ్చుకొంటున్నారని తెలిపారు.
ఇప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నదని చెప్పారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో సాగునీరు పారుతున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద నదులు ఉన్నా సాగు, తాగునీరు ఎందుకు అందటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఏటా 70 వేల నుంచి 80 వేల టీఎంసీల నీరు వృథాగా పోతున్నదని, ఇది పొలాల్లోకి రావాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. దేశంలో అవసరం మేరకు బొగ్గు, హైడ్రో వనరులు ఉన్నా 75 ఏండ్లుగా కరెంటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని, అదే తెలంగాణలో రెండేండ్లలో 24 గంటల కరెంటు ఎలా ఇస్తున్నారని ఇతర రాష్ర్టాల వారు గమనిస్తున్నారని తెలిపారు. ఇది సాధించిన కేసీఆర్ జాతీయ నాయకుడిగా వస్తే తమకూ 24 గంటల కరెంటు వస్తుందని ఆశపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
పార్టీ నాయకులుగా, మంత్రులుగా తాము కూడా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, రైతుల బాగు కోసం దేశ రాజకీయాల్లోకి రావాలని, అతి త్వరలోనే దేశ పగ్గాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నామన్నారు. ఒక్కసారి జాతీయ పార్టీ ప్రకటిస్తే దేశ ప్రజలంతా అండగా నిలుస్తారని తెలిపారు. యూపీఏ, ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావొద్దని ప్రతి ఒక్కరూ కోరుకొంటున్నారని చెప్పారు. బీజేపీ మళ్లీ వస్తే ఎల్ఐసీ, రైల్వేలు, రోడ్లు ఇలా అన్నింటినీ అమ్మేస్తారని, ఆ పార్టీని ఎవరూ ఆదరించే పరిస్థితి లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడిందని, ఇక ప్రత్యామ్నాయంగా కేసీఆర్ మాత్రమే దేశ ప్రజలకు కనిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కరే ఉన్నారని, కానీ తర్వాతి కాలంలో అన్ని పక్షాలు జై తెలంగాణ అంటూ ముందుకు వచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఒక్కసారి కేసీఆర్ జాతీయ ఎజెండా ప్రకటిస్తే అన్ని పార్టీ నాయకులు కేసీఆర్ వెంట నడుస్తారని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ వై సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.