కరీంనగర్ : రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచి నష్టపరిహారం ఇప్పించేందుకు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో రైతుల పంట పొలాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కట్టే జీఎస్టీ పన్నులతో కేంద్రం ఎంజాయ్ చేస్తుందని ప్రజలు, రైతులు కష్టాల్లో ఉంటే కేంద్రం సహకరించకపోవడం దారుణమన్నారు.
వర్షాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో గవర్నర్(Governor), కేంద్ర మంత్రులు(Union Ministers), ఎంపీ(MP’s)లు చేయాల్సింది రాజకీయాలు కాదని హితవు పలికారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రధానికి గవర్నర్ గా లేఖ రాయాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు సడలించేలా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లాల్లో తడిసిన ధాన్యంతో 67 కిలోల ఔటర్న్ రాదని, రైతులకు అండగా ఉండడం కోసం దీన్ని 50 కిలోలకు తగ్గించాలని కోరారు.
రాజకీయ లబ్ధి(Political Benifit) కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా కాకుండా నష్టనివారణ కోసం చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ సైతం బాధ్యత తీసుకుని ఎఫ్సీఐ (FCI) అధికారులను పిలిచి కేంద్రంపై ఒత్తిడి పెంచి రైతుల్ని ఆదుకోవడంలో కలిసి రావాలన్నారు., అవసరమైతే కల్లాల వద్దకు రావాలని, తాము సైతం పరిస్థితులను వివరిస్తామన్నారు.
సీఎం కేసీఆర్(CM KCR) రైతులకు అండగా నష్టపరిహారం(compensation) పదివేలు ప్రకటించారని దానికి అధనంగా కేంద్రం మరో 20 వేలు ప్రకటించాలని, తడిసిన ధాన్యం కొనడానికి నిబంధనలు సడలించాలని కోరారు. రూ. 43లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రంలో రైతులను ఆదుకునేందుకు డబ్బులు లేవా లేక కేంద్ర పెద్దలకు మనసు లేదా అని ప్రశ్నించారు.