కరీంనగర్ కార్పొరేషన్/హైదరాబాద్/సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ), ఆగస్టు 4: తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గౌడ, బీసీ సంఘాల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. గౌడ కులంలో పుట్టి బహుజనులందరి హకుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
బీసీ సంఘాల హర్షం..
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావుగౌడ్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. ఉత్సవాల నిర్వహణకు రూ.10 లక్షలు మంజూరు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు, అందుకు కృషిచేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు.