కరీంనగర్ : వినాయక మంటపాలకు, నిర్వాహకులకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బాసటగా నిలుస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాలకు అవసరమైన కరెంట్ కోసం మంత్రి గంగుల కమలాకర్ తన సొంత నిధులు 4 లక్షల చెక్కును ఎలక్ట్రిసిటీ అధికారులకు అందజేసారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వినాయక మండపాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే విషయంలోఎలక్ట్రిసిటీ అధికారులతో సమావేశం నిర్వహించి రూ.4లక్షల చెక్ని అందజేశారు.
గత కొన్నేళ్లుగా సొంత నిధులతో మంత్రి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతియేటా వినాయక చవితి నవ రాత్రి ఉత్సవాలకు విద్యుత్ బిల్లులు తానే చెల్లిస్తున్నాని మంత్రి గంగుల గుర్తు చేశారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు.. సరైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వినాయక చవితి పండుగను ప్రశాంతంగా..జరుపుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వినాయక మంటప నిర్వాకులు విద్యుత్ అధికారులకు సహకరించాలని స్పష్టంచేశారు. అంతకుముందు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ కనమల్ల విజయ, కలెక్టర్ బి గోపి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఎస్ఈ గంగాధర్, డీఈ రాజం, తదితరులు పాల్గొన్నారు.