కరీంనగర్ : ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల(Government Medical College)ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు సైతం వైద్య విద్యను అభ్యసించేందుకు సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నచోట ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావడం అరుదైన విషయమని, సీఎం కేసీఆర్ చొరవతో కరీంనగర్లో సాధ్యపడిందని అన్నారు. కరీంనగర్(Karimnagar)లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉన్నాయని వివరించారు.ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకతో హైదరాబాద్, వరంగల్ తర్వాత కరీంనగర్ మెడికల్ హబ్(Medical Hub) గా మారనుందని తెలిపారు.
దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందని మండిపడ్డారు.సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు( Minister Harish Rao) చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. నూతన భవనంలో ఆగస్టు 8 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలోనే క్లాసులు నిర్వహిస్తామని ఆయన అన్నారు.