75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఎవ్వరూ చేయనివిధంగా బీసీలకు సీఎం కేసీఆర్ మేలు చేస్తున్నారని, దాదాపు రూ. ఎనిమిది వేల కోట్ల మార్కెట్ విలువ గల భూమిని బడుగు, బలహీన బీసీ వర్గాలకు కేటాయించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఏక సంఘంగా ఏర్పడ్డ 11 కుల సంఘాలకు హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సహచర మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో కలిసి పట్టాలు అందజేశారు. రజక, పద్మశాలీ, నాయీబ్రాహ్మణ, ముదిరాజ్, వాల్మీకి బోయ, గాండ్ల, బొందిలి, కచి, ఆరేకటిక, భూంజ్వా, సంచార జాతులవారు పట్టాలు అందుకున్నారు.
ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నేడు పట్టాలు పొందిన పదకొండు కులాలతో పాటు గతంలో 24 కులాలకు పట్టాలు అందజేశామని, వీరందరికీ నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఈ 35 కులాలు వచ్చే ఏడాదికల్లా గృహ ప్రవేశాలు నిర్వహించుకోవాలన్నారు. మిగతా సంఘాలను సైతం త్వరలోనే ఏకం చేస్తామన్నారు. వీటిలో కులం అవసరాలు తీరేలా.. భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేలా ఫంక్షన్ హాళ్లు, హాస్టళ్లు, వసతి సౌకర్యాలు, విద్యా కోచింగ్ కేంద్రాలు, ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి ప్రాంతాల్లో 41 కుల సంఘాలకు జనాభాపరంగా సీఎం కేసీఆర్ అత్యంత విలువైన వేల కోట్ల విలువ చేసే 87.3 ఎకరాల భూమి ఇచ్చారన్నారు. అలాగే, భవన నిర్మాణానికి సైతం రూ. 95 కోట్లను కేటాయించి, ఆత్మగౌరవం ఇనుమడించేలా భవనాలు కట్టుకునే అవకాశం ఏక కుల సంఘం ట్రస్టులకే కల్పించారన్నారు. వీటిలో కులానికి సంబంధించిన ప్రతీ వ్యక్తికి భాగస్వామ్యం ఉంటుందన్నారు.
తొలిసారిగా బీసీలను ఏకం చేస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆయన మనకాలపు మహాత్మా జ్యోతిబాఫూలే అని కొనియాడారు. దేశంలోని బీసీ ముఖ్యమంత్రుల్లో ఎవరూ చేయని విధంగా నేడు రూ. 8వేల కోట్ల విలువైన స్థలాల్ని బీసీ ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించారని చెప్పారు. నేడు పట్టాలు తీసుకున్న ప్రతీ ఒక్క కులం తమ ఆత్మగౌరవం ప్రతిఫలించేలా భవనాల్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు గతంలో 19 గురుకులాలు ఉండగా, మరో 310 ఏర్పాటు చేశారన్నారు. వేల కోట్ల రూపాయలతో గొల్లకురుమలకు గొర్లు, ముదిరాజ్, గంగపుత్రులకు చేపపిల్లలతోపాటు ప్రతీ కులవృత్తికి వెన్నుదన్నుగా కేసీఆర్ సర్కార్ నిలుస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పెద్దపల్లి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.