నమస్తే తెలంగాణ నెట్వర్క్/హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలంతా ఒకే వేదికపైకి రా వడం.. కార్యకర్తలు తమ సాదకబాధకాలు చెప్పుకోవడం అందరిని ఆకట్టుకుంటున్నది. ఒక కుటుంబం మాదిరిగా ఆత్మీయ పలుకరింపులు శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నది. అన్ని చోట్లా ఆనందంతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి కేకలే..
వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, కొత్తకోటలో బీవీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి కేకలతో విలవిల్లాడిన పరిస్థితుల నుంచి నేడు స్వరాష్ట్రంలో దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందని అన్నారు.
బలం.. బలగం కార్యకర్తలే
బీఆర్ఎస్కు పార్టీ కార్యకర్తలే బలం, బలగమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడుతూ.. కార్యకర్తలు ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు.
మోదీతో ధరల మోత
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం లింబాద్రి గుట్ట వద్ద బీఆర్ఎస్ కుటుంబ సమ్మేళనం నిర్వహించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు అరి గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీగా కార్యకర్తలు..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మూడు వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సర్వనాశనమైందని అన్నారు.
నిలదీస్తే కేసులా?
నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లడిగే నైతిక హక్కు లేదని తెలిపారు.
స్టెప్పులేసిన ఎమ్మెల్యే
హనుమకొండలోని వడ్డేపల్లిలో గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు, కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. వర్ధన్నపేట గడ్డపై గులాబీ జెండా పాటను గాయకులు ఆలపించగా మహిళలు, కాలనీ వాసులు స్టేజీపై డ్యాన్స్ చేశారు. ఎమ్మెల్యే కూడా ఆనందంతో స్టెప్పులేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు
మెదక్ జిల్లా మాసాయిపేట్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఇన్చార్జి ఎగ్గే మల్లేశం, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఇన్చార్జి వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్లో నిర్వహించిన సమ్మేళనంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, రామారెడ్డిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, నారాయణపేట జిల్లా మరికల్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అయిజ మండలం సంకాపురంలో ఎమ్మెల్యే అబ్రహాం, ఎమ్మెల్సీ రవీందర్రావు, కోదాడ నియోజకవర్గం నడిగూడెంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరిగాయి. ఉప్పల్లో మంత్రి మల్లారెడ్డి, పార్టీ జిల్లా ఇంచార్జి ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, కూకట్పల్లిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
తెలంగాణలోనే మస్తు అభివృద్ధి
నల్లగొండ జిల్లా తిప్పర్తిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో తెలంగాణ తరహాలో అభివృద్ధి జరగడం లేదని అన్నారు.
మహిళల ముఖాల్లో సంతోషం
తెలంగాణలో భావితరాల బాగు కోసం ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని, ముందు నుంచి కూడా ఆయన కార్మికుల పక్షపాతిగానే ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో జరిగిన బీఆర్టీయూ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ పేదల ఆకలి బాధలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని, ఆడబిడ్డల ముఖాల్లో వెలుగులు, సంతోషం చూడాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
సమ్మేళనానికి చంటి బిడ్డతో తల్లి
కేసీఆర్పై ప్రేమతో హాజరయ్యానని వెల్లడి
కొత్తకోట, మార్చి 26 : సీఎం కేసీఆర్పై ఉన్న ప్రేమతో ఎండను సైతం లెక్క చేయకుండా ఓ మహిళ చంటి బిడ్డతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి హాజరైన అందరి దృష్టిని ఆకర్షించింది. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని బీపీఆర్ గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి దాదాపుగా 5 వేల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అందులో సగం మంది మహిళలు ఉండటం విశేషం. సభలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాట్లాడుతుండగా అప్పరాల గ్రామానికి చెందిన పద్మ తన బిడ్డ వేదాంతితో కనిపించగా.. మంత్రి ఆమెను లేపి చంటి బిడ్డతో ఎందుకు వచ్చావమ్మా? అని అడిగారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిపై ఉన్న ప్రేమతో సమ్మేళానికి వచ్చినట్టు సమాధానం చెప్పడంతో సభలో కరతాళ ధ్వనులతో మార్మోగింది.