అన్నపురెడ్డిపల్లి, జనవరి 13: నిరుపేద యువకుడి వైద్యానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామానికి చెందిన మోటపోతుల వెంకటేశ్వరరావు ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో తలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం తల వాపుతో బాధపడుతున్నారు. ఆపరేషన్కు ఆర్థిక స్థోమత లేకపోవడంతో అతని తల్లిదండ్రులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సమస్యను ట్విట్టర్ ద్వారా తెలుసుకొన్న మంత్రి కేటీఆర్ వెంటనే తన సిబ్బందితో బాధిత కుటుంబానికి ఫోన్ చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు మంజూరు చేయించారు. శస్త్రచికిత్సకు చొరవ తీసుకొన్న మంత్రి కేటీఆర్కు బాధితుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.