హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టర్ను షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ 14న అంబేద్కర్ జయంతిని ట్యాంక్ బండ్ సమీపాన ఉన్న విగ్రహం వద్ద ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సందర్భంగా కమిటీ రూపొందించిన ప్రచార పోస్టర్ను మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ చైర్మన్లు రావుల విజయ్ కుమార్, నాగారం బాబు మాదిగ, వైస్ చైర్మన్ ఏర్పుల యాదయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, నాయకుడు మేడి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.