వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్, బీజేపీ విధానాలపై మండిపడ్డారు. బోగస్ మాటలు, కిరికిరి చేష్టలతో కాంగ్రెస్ దేశాన్ని పాలించిందని, చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో వుందని, ఆ పార్టీ కూడా చేసిందేమీ లేదని దెప్పిపొడిచారు. ఈ రెండు పార్టీలతో ఒరింగిందేమీ ఉండదన్నారు. ఊదు కాలదు.. పీరీ లెవ్వదు అన్న చందంగా ఆ పార్టీల పరిస్థితి తయారైందని చురకలంటించారు.
బీజేపీ, కాంగ్రెస్ను నమ్ముకుంటే నిండా మునిగిపోతామని మంత్రి ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. ఆ రెండు పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో చేసిందేమీ లేదని, తెలంగాణకు వచ్చి ఏమో చేస్తామని గొప్పలకు పోతున్నారని విరుచుకుపడ్డారు. ఇక్కడికి వచ్చి, బడాయి మాటలు చెప్పడం మాని, పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
గ్రామాల అభివృద్ధితో నే, దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇదే స్ఫూర్తి తో సీఎం కెసిఆర్ పరిపాలన చేస్తున్నారు. అందరినీ సంతృప్తి పరచడం అమ్మా నాయినలకే సాధ్యం కాదు. కాబట్టి ఒక్కొక్కటిగా అన్నీ పనులను పూర్తి చేసుకుందాం. మీ అభివృద్ధి నా బాధ్యత. దయన్న గా మీ అందరినీ కాపాడుకుంటాను అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
పిచ్చవ్వా! బాగున్నవా?! ఏమి చేస్తున్నవు? పిల్లలు గిట్ల అంత నిమ్మలమే గదా! అంటూ తనకు చిరకాల పరిచయం ఉన్న పిచ్చవ్వ ను పలకరించారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. రాయపర్తి లో ఐకేపీ నుండి 20 లక్షలతో ఏర్పాటు చేసిన వరి గడ్డి ని కట్టలు కట్టే యంత్రం ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన పిచ్చవ్వ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి కనిపించింది. దీంతో మంత్రి స్వయంగా ఆమె వద్దకు వెళ్ళి, ఎలా ఉన్నవంటూ పలకరించారు. ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆమెను దగ్గరకు తీసుకొని తన ఆమె పట్ల తన ఆప్యాయతను చాటుకున్నారు.