Minister Fishing | జనంతో ఇట్టే కలిసిపోయే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఆదివారం ఓ సరదా సన్నివేశంలో భాగస్వాములయ్యారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తూ చేపలు పడుతున్న వారి వద్ద తన కాన్వాయిని ఆపి.. గాలం వేసి వారితో మాటలు కలిపాడు. తన చిన్ననాట ఎక్కడ చూసినా ఉండే చేపల వేట ఇప్పుడు కనిపించకుండా పోయిందని చమత్కరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకుని వరంగల్ బయల్దేరారు. మార్గమధ్యంలో నెల్లికుదురు మండలం మేచరాజు పల్లె దాటి ఎర్రబెల్లి గూడెం మీదుగా వెళ్తుండగా.. అక్కడ కొందరు చేపలు పడుతూ కనిపించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. వారి నుంచి గాలం తీసుకుని చేపల వేట మొదలెట్టారు. ఈలోగా వారితో మాటలు కలిపిన మంత్రి.. తన గురించి, తెలంగాణ గురించి ప్రశ్నలు వేసి నవ్వించారు. ఒకప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా చేపల గాలం వేయడం కనిపించేదని, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు కనుమరుగైపోయిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. కేసీఆర్ సీఎం అయ్యాక.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాక.. చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరాయని చెప్పారు. అలాగే కోట్ల సంఖ్యలో చేపలను ఉచితంగా చెరువుల్లో వేస్తూ చేపల విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయని, దాంతో చేపలు పట్టే వాళ్ళ కు ఉపాధి, ఆదాయం పెరిగి వాళ్ళ కుటుంబాలు ఉన్నతంగా ఉన్నాయన్నారు. మంత్రే నేరుగా తమ వద్దకు వచ్చి గాలం వేసి సరదాగా చేపలు పట్టడంతో వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేశారు.