హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) సూచించారు. ఏ సమయంలో ఏ సమస్య వచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండి సిద్దంగా ఉండాలని దీని కోసం జిల్లా కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మంత్రి సత్యవతి రాథోడ్, ఐదు జిల్లాల ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సీపీ, ఎస్పీ, ఇతర అధికారులతో మంత్రి గురువారం టెలి కాన్ఫరెన్స్ (Tele Conference ) నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్ , టోల్ ఫ్రీ నంబర్(Toll Free Numbers ) ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ఆయా జిల్లాల కలెక్టర్లు వివరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్ ( Red ), ఆరెంజ్ అలెర్ట్ (Ornge Alert )ఉందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తూ వెంటనే అధికారులకు సమాచారం అందించాలని మంత్రి సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకండా సహాయ సహకారాలు అందించాలని, నియోజకవర్గ పరిధిలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థ ఇళ్లలో ఉంటున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించాలని వివరించారు.