రంగారెడ్డి : మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించిన నేతలు దివంగత ఎన్టీఆర్, ఆ తరువాతే సీఎం కేసీఆర్ మాత్రమేనని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ నేతృత్వంలో 22 కోట్ల రూపాయల విలువైన బీటీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించే దిశగా మాజీ సీఎం ఎన్టీఆర్, తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ మాత్రమే కృషి చేశారని, చరిత్రలో వీరికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.
మొట్టమొదట డ్వాక్రా మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్థిక స్వాలంబన దిశగా ఎన్టీఆర్ కృషి చేశారని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక మహిళలకు పూర్తి ఆర్థిక స్వేచ్ఛను కల్పించారని తెలిపారు. మహిళలకు తెలంగాణలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
అనంతరం కేశంపేట మండలం, సంగెం గ్రామంలో ప్రముఖ కాంట్రాక్టర్ ఎన్నం గోపాల్ రెడ్డి కుమారుడు కీ.శే ఎన్నం ప్రసూన్ రెడ్డి 40వ జయంతి వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై మంత్రి చేతులమీదుగా వేలాదిమంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోపాల్ రెడ్డి కుమారుడు చనిపోయిన అతని యాదిలో పేద ప్రజలకు సేవ చేసుకుంటూ ఎంతో కాలంగా ప్రజాసేవలో తన కుమారున్ని చూసుకుంటున్న గోపాల్ రెడ్డి ఎంతో గొప్ప వారని అభినందించారు. ఎన్నో సేవలను ఉచితంగా అందిస్తున్న గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.