హైదరాబాద్ : జనగామ జిల్లా వనపర్తి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న టాటా ఏసీ డ్రైవర్ కు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యులను ఆదేశించారు.
జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల ఘనపురం మండలం వనపర్తి స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు..హైదరాబాద్కు చెందిన శేఖర్ రెడ్డి భార్య ధనలక్ష్మి కుమారుడు రఘుమారెడ్డితో కలిసి తిరుమలగిరిలో వాళ్ల బావ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కార్లో వెళ్తున్నారు.
ఈ క్రమంలో వనపర్తి సమీపంలో కారు టైర్ పేలిపోవంతో కారు అదుపు తప్పి తుమ్మలగూడెం నుంచి జనగామకు బర్రెల లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. టాటా ఏస్ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో జనగామ దవాఖానకు తరలించారు.