జనగామ : ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే గొప్ప సంస్కృతిని సీఎం కేసీఆర్ మొదలు పెట్టారు. అదే బీజేపీ మత తత్వాన్ని పెంచి పోషిస్తూ కలిసి ఉండే ప్రజల మధ్య విషం చిమ్ముతూ విద్వేషాన్ని పెంచుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. జిల్లాలోని పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో ‘సద్గురు సేవా సత్సంగ్ మందిరం కమ్యూనిటీ హాల్’ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని మతాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలకు ప్రభుత్వం బట్టలు పెట్టి ఘనంగా నిర్వహిస్తున్నది.
ఇలాటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. అన్ని మతాలను గౌరవించాలని చెప్పిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ గౌరవించి, ఆ గౌరవాన్ని మరింత పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను విడదీసి పాలిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, మల్లంపల్లి సర్పంచ్ గిరగాని హేమలత, కొడకండ్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.