మహబూబాబాద్ : ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని గతంలో వర్ధన్నపేట నియోజకవర్గం, ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,(Minister Errabelli )ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు పేర్కొన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో యువతకు ఉచితంగా ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల జారీ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పెద్ద వంగర మండలంలోని పెద్ద వంగర మండలంలోని పోచారం, బొమ్మకల్, కాన్వాయ్ గూడెం, అర్ కే తండా, మోత్యా తండా, ఎల్ బి తండా, పడమటి తండా, బీసీ తండా, భావోజి తండాలకు చెందిన 210 మందికి ఉచిత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను మంత్రి దంపతులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఉషా దయాకర్ రావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు చేపట్టిన అన్ని కార్యక్రమాలు దిగ్విజయం అయ్యాయని, మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. తమ కుటుంబం పూర్తిస్థాయిలో ప్రజాసేవకే అంకితం అయిందని అన్నారు. ఆరోగ్య శిబిరాలు, కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ, ఉచిత కుట్టు శిక్షణ, ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, ఉపాధి కూలీలకు లంచ్ బాక్సుల పంపిణీ, ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ వంటి కార్యక్రమాలు అనేకం విజయవంతంగా పూర్తి చేసి మంచి ఫలితాలు సాధించామని మంత్రి చెప్పారు.
ప్రజలకు సేవ చేస్తే అది వృథా కాదని, ప్రజలు కచ్చితంగా వాటిని గుర్తు పెట్టుకొని తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తారని మంత్రి అన్నారు. తాను తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషుల ద్వారా సేకరించిన డబ్బును ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదాలు తనకి ఎప్పుడు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.