వరంగల్ : ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఏకశిల పార్క్లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1952 లో జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమంలో, తర్వాత సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఎవరు మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ అని కొనియాడారు.
విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారని మంత్రి గుర్తు చేశారు. జయశంకర్ సార్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరవలేనిది.
తెలంగాణలోని ప్రతీ పల్లె ఆయన మాటతో పోరాట గుత్పలను అందుకుందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు మార్గదర్శిగా తోడ్పాటు అందించి సిద్ధాంత కర్తగా చరిత్రలో జయశంకర్ నిలిచిపోయారు.
కాగా, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జయశంకర్ సార్ ఆకాంక్షలను, ఆశయాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జయశంకర్ సార్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.