హైదరాబాద్ : నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబ్లె దయాకర్ రావు అన్నారు.ఐలమ్మ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో గల తన క్యాంప్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.
దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మ లాగా ఉద్యమ కారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలు అని ప్రశంసించారు. ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారు. పరిపాలనలో కూడా అదే ఉద్యమ స్ఫూర్తిని పాటిస్తున్నారు. అందుకే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా మారిందన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తుండటం పట్ల సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.