హైదరాబాద్ : డా. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా, తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అమెరికాలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జగ్జీవన్ రామ్ దేశాభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
బాబూజీగా ప్రసిద్ది చెందిన జగ్జీవన్ రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంతేకాదు భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగ్జీవన్ రాం అందించిన సహకారం అనితర సాధ్యమైందని గుర్తు చేశారు.
బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనే వారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేసి ఎన్నో ఉద్యమాలు నడిపారన్నారు. ఆ మమహనీయుడి స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.