వరంగల్ : తెలుగు వారి ఠీవి పీవీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మాజీ ప్రధాన మంత్రి పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియలోని పీవీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పీవీ జన్మించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పీవీ శత జయంతి ఉత్సావాలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. పీవీ గురించి ఎంతచెప్పినా తక్కవే అన్నారు.
దేశ ప్రధానిగాఎదిగిన పీవీ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని ప్రశంసించారు. తెలంగాణ ప్రాంతం కన్న ముద్దు బిడ్డ పీవి అని, ఉమ్మడి వరంగల్ జిల్లాతో ఆయనకు మంచి అనుబంధం ఉందనిగుర్తు చేసుకున్నారు. లక్నేపల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. పీవీ స్వయంగా వందల ఎకరాలకు యజమాని ఐనప్పటికీ, భూ సంస్కరణలు అమలు చేసి, పేదలకు భూములు అందేలా చేసిన మహనీయుడు పీవీ అన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ.. దేశ, విదేశాలలో పీవీ శతజయంతి ఉత్సావాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ బాబు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా పరిషత్ చైర్మెన్ సుధీర్ కుమార్, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజిస్ ఖాన్, పీవీ బంధువులు, మదనమోహన్ తదితరులు పూల మాల వేసి నివాళులు అర్పించారు.