హైదరాబాద్ : దేవాదుల రిజర్వాయర్లు, కాలువలకు సంబంధించిన భూసేకరణపై అధికారులు, రైతులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆఖరు ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు వేగంగా భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూసేకరణకు సహకరించాలని రైతులను కోరారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం, పరిధులు, పరిమితులు వివరించారు. అధికారులు చట్టానికి లోబడి రైతుల పట్ల సానుభూతి, సహానుభూతితో వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, గ్రామాలు, రాష్ట్రం, ప్రజల అందరి కోసం కొంత త్యాగం తప్పదని, అయితే దేవాదుల కాలువల కోసం భూములు ఇస్తున్న రైతుల సమస్యలు ఏవి ఉన్నా, వాటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) భాస్కర్ రావు, ఆర్డీవో, దేవాదుల ప్రాజెక్టు సీఈ, ఇంజినీర్లు పాల్గొన్నారు.