హైదరాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్, తెలంగాణ (నిజామాబాద్ జిల్లా) బిడ్డ నిఖత్ జరీన్ కు కేంద్రం అర్జున అవార్డును ప్రకటించింది. క్రీడారంగంలో అత్యంత ప్రతిభను కనబరిచే క్రీడాకారులకు ప్రతి ఏటా ఇచ్చే అర్జున అవార్డుల్లో ఈసారి నిఖత్ జరీన్కు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన నిఖత్కు అర్జున అవార్డు రావడం తెలంగాణకే గాక, దేశానికే గర్వకారణమని మంత్రి అన్నారు. ప్రపంచ స్థాయిలో మరింతగా రాణించి, దేశ కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.