హైదరాబాద్ : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లెలో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్లను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ప్రారంభించారు. శిలాఫలకాన్ని ప్రారంభించి, ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మంత్రికి లబ్ధిదారులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామ ప్రధాన కూడలిలో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం సహకారం లేకపోయినా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితమే డబుల్ బెడ్రూం ఇండ్లనీ, తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నాయన్నారు. గత కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందని, అధికారంలో ఉన్న సమయంలో మంచినీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చెరువులను బాగు చేసి.. వాటిని నీటితో నింపి పంటలకు ఇస్తున్న ఘనత కేసీఆర్దేనన్నారు. సింగరాజు పల్లెకు రుణపడి ఉంటానని మంత్రి అన్నారు. గ్రామం తన వెన్నంటి ఉందని, అందుకే విధాలుగా అభివృద్ధి చేస్తున్నానన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, పంటలకు సాగునీరు ఇచ్చామని.. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ వేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జాతీయ అవార్డును పొందిన జిల్లా కలెక్టర్ శివ లింగయ్యను, సింగరాజు పల్లె డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిన కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని మంత్రి సత్కరించారు. ఆ తర్వాత లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.