హైదరాబాద్, సెప్టెంబర్ 9 : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేశామని ఆశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఖైరతాబాద్, ఉప్పల్లో ఏర్పాటు చేసిన పీఆర్ డివిజనల్ కార్యాలయాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా 87 కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయగా సీఈ, సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాలలో నేడు సంబంధిత అధికారులు బాధ్యతలు తీసుకు న్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 237 ఇంజినీరింగ్ కార్యాలయాలు ఉండగా మిషన్ భగీరథతో పాటు ఇతర కార్యక్రమాల ద్వారా పంచాయతీరాజ్ కార్యకలాపాలు విస్తరించడంతో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
సీఎం కసీఆర్ ఆదేశాల మేరకు కొత్తగా నాలుగు చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయాలు, 12 కొత్త సర్కిల్, 11 డివిజన్లు, 60 కొత్త సబ్ డివిజన్లు, 4 రోజుల్లో అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొత్త కార్యాలయాల కోసం కింది స్థాయి అధికారులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు.
దీంతో ఏఈ స్థాయితో పాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 740 ఖాళీ అయ్యాయి అన్నారు. త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, చీఫ్ ఇంజినీర్ సంజీవ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.