పాలకుర్తి, జులై 1 : ఎర్రబెల్లి ట్రస్టు ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. తాజాగా పాలకుర్తిలో డ్రైవింగ్ లైసెన్స్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ మేళాను సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించి మాట్లాడారు.
నేటి నుంచి జులై 31వ తేదీ వరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలన్న లక్ష్యంతోనే ఈ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని మంత్రి సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం నేరమన్నారు.
అందుకే తాముఈ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పాలకుర్తిలోని పార్టీ కార్యాలయంలో అప్లికేషన్స్ తీసుకుంటారని, దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, టెన్త్ సర్టిఫికెట్, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకుని రావాలని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని, దరఖాస్తులు మాత్రం పాలకుర్తిలోనే ఇవ్వాలని మంత్రి సూచించారు.