వరంగల్, సెప్టెంబరు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పల్లెలు సమగ్ర ప్రగతి సాధించాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ నిలిచిందని పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధి కేటగిరిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవార్డు తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నదని చెప్పారు.
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను, విభాగాలను పునర్విభజన చేసిందని, దీని వల్ల ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తున్నాయని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులు, సిబ్బందికి భారీగా ప్రమోషన్లు వచ్చాయని చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఇంజినీర్..వరంగల్, హనుమకొండలో జిల్లాల కార్యాలయాలను మంత్రి దయాకర్ సోమవారం ప్రారంభించారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పునర్ వ్యవస్థీకరణ చేశారని, దీనితో కొత్తగా 740 మందికి ఉద్యోగ అవకాశాలు, అనేక మందికి ప్రమోషన్లు వస్తున్నాయని అన్నారు. పునర్ పునర్ వ్యవస్థీకరణ మేరకు అన్ని జిల్లాల్లో కొత్త కార్యాలయాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు.
మిషన్ భగీరథ, పల్లెప్రగతి, పంచాయతీరాజ్ కార్యకలాపాలు విస్తరించడంతో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 237 ఇంజినీరింగ్ కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. కొత్తగా 4 చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు, 12 కొత్త సరిళ్లు, 11 డివిజన్లు, 60 సబ్ డివిజన్లు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, పీఆర్ ఇంజినీరింగ్ విభాగం సీఈ సీతారాములు, ఎస్ రఘువీరారెడ్డి, ఈఈ శంకరయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.