వరంగల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బోగస్ మాటలు మాట్లాడుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు.
కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలుకు ఆలవిగాని హామీలు ఇస్తున్నారు.అధికారంలో ఉన్నన్ని రోజులు దోపిడీ చేశారు. బీజేపీ బడా జూటా మాటలను ఇంకా నమ్ముదామా? ఊరికి ఒకరిద్దరు మోపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. దేశంలో ఎక్కడ లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు.
రైతులకు ఎదురు పెట్టుబడి పెట్టిన మహానుభావుడు కేసీఆర్ అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా ఉందా? 24 గంటల కరెంటు ఎక్కడైనా వస్తుందా? మన కేసీఆర్ కిట్లు ఎక్కడైనా ఇస్తున్నారా? కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి స్పష్టం చేశారు.
సంగెం మండలానికి ఎక్కువ నిధులు ఇచ్చాం. ఇంకా కావాలంటే కూడా ఇస్తాం. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నదే సీఎం ఆశయమన్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డిని మీరందరు ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ గోపి, సంగెం మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.