గంట్ల కుంట (మహబూబాబాద్): తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇటీవల మంజూరు చేసిన కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడప గడపకూ తిరిగారు. పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో లబ్ధిదారులకు కొత్త పింఛన్లను అందజేశారు. అలాగే, ఆ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు.
మనకు గత ప్రభుత్వాలు ఏం చేశాయి?.. ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? అనేది ప్రజలే విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన పథకాలు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ ఏం చేసినా ప్రజల మేలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందనివారు నిరుత్సాహపడకూదని, భవిష్యత్తులో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పక్క రాష్ట్రాల్లో కేవలం రూ. 500 పింఛన్ ఇస్తూ.. ఇంట్లో స్కూటర్ ఉండొద్దు, ఇల్లు స్లాబ్ అయి ఉండకూడదనే కండిషన్లు పెడుతున్నారని తెలిపారు. కానీ, మన తెలంగాణ సర్కారు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు వయోపరిమితిని తగ్గించి వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నదని చెప్పారు. ఇది చాలా గొప్ప విషయమన్నారు. పాలకుర్తి ప్రజల ఆశీర్వాదం తనకెప్పుడూ ఉండాలని ఆయన కోరారు.