తొర్రూరు : తొర్రూరు మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) తెలిపారు. ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులతో అభివృద్ధి చెందిన డివిజన్ల కు కాస్త తక్కువ, తక్కువ అభివృద్ధి జరిగిన డివిజన్ల కు కాస్త ఎక్కువ నిధులు కేటాయించాలని అధికారులకు సూచించారు.
మంగళవారం పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులు , ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) త్వరలోనే తొర్రూరు పట్టణానికి వచ్చే అవకాశముందని వివరించారు. సీఎం కేసీఆర్(CM KCR) , మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో తొర్రూరు ను మున్సిపాలిటీ చేశాక అనేక రకాల నిధులతో పట్టణ రూపు రేఖలను మార్చామని పేర్కొన్నారు. పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇప్పటికే అనేక రకాలుగా వచ్చిన నిధులను తొర్రూరు పట్టణ అభివృద్ధికి వినియోగిస్తున్నామని చెప్పారు.
కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలపై రాజీ పడొద్దని సూచించారు. ఇండోర్ స్టేడియం పాల కేంద్రం దగ్గర డివైడర్లు, అంతర్గత సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు వంటి వివిధ రకాల పనుల పురోగతి పై మంత్రి పనుల వారీగా, డివిజన్ల వారీగా సమీక్షించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులపై ఆయా డివిజన్ల కౌన్సిలర్లు, అధికారుల సమక్షంలో మంత్ని వివరంగా చర్చించారు.
పట్టణంలోని దాదాపు 8 జంక్షన్లు, మున్సిపల్ భవనం, పాలకుర్తి తరహాలో రోడ్ల డివైడర్ లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. తొర్రూరు చెరువు కట్టను హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా అభివృద్ధి పరచాలని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ పద్ధతిని కూడా ఆలోచించాలన్నారు. ఈ సమీక్షలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జీనుగ సురేందర్ రెడ్డి, కమిషనర్ బిందు శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.