మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎవరూ ఊహించని విధంగా గ్రామాల అభివృద్ధి జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli )అన్నారు. మహబూబాబాద్(Mahaboobabad) జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం అమర్ సింగ్ తండా, జీకే తండాలలో గ్రామపంచాయతీ భవనాలు, చౌకధరల డిపోలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించామని , రోడ్లు, నీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని వివరించారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు.
రూ.20 కోట్లతో చీకటయపాలెం నుంచి అమర్ సింగ్ తండా మీదుగా హరిపిరాల వరకు డబుల్ రోడ్డు, అమర్ సింగ్ తండా 25 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో యువతులకు కుట్టు మిషన్ల శిక్షణ అందిస్తూ వారికి ఉచితంగా కుట్టు మిషన్లను అందజేస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమాల్లో మంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రమేశ్, ఎమ్మార్వో, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.