కొడకండ్ల, ఏడునూతుల (పాలకుర్తి నియోజకవర్గం) : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. దీంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం కొడకండ్ల, ఏడునూతుల గ్రామంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ (BRS)ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతున్నదని వెల్లడించారు.
రైతులకు ఇస్తున్న ఉచిత 24 గంటల విద్యుత్(Free Power) వల్ల ప్రతి ఏటా రైతుల తరపున రూ. 10,500 కోట్లను విద్యుత్ సంస్థకు చెల్లిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(Bjp Government) విధానాలను తిప్పికొట్టాలని సూచించారు. మహిళా సాధికారత దిశగా ఉచిత కుట్టు శిక్షణ, మిషన్ల పంపిణీ అందజేస్తూ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువకుల కోసం కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
నియోజకవర్గంలోని ఒక్కో మండలాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు(Decade Celebrations) నిర్వహించుకుంటున్న సమయంలో అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రజలు కూడా ఆయా పనులను విశ్లేషించుకుని, సీఎం కేసీఆర్ అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.