పల్లెప్రగతి కార్యక్రమంలో తెలంగాణలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం రాయపర్తి, జనగామ జిల్లా కడవెండిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమాలను కిందిస్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి అధికారుల వరకు పర్యవేక్షించాలన్నారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని వెల్లడించారు. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం లేదని చెప్పారు. అందువల్లే మన పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే, అందులో 19 మనవేనని గుర్తుచేశారు.
తెలంగాణలో ఒకప్పుడు గంగదేవిపల్లె మాత్రమే దేశంలో ఆదర్శ గ్రామంగా ఉండేదని, పల్లెప్రగతి కార్యక్రమంతో ఇప్పడు గంగదేవి పల్లె గ్రామాన్ని మించి ఎన్నో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని చెప్పారు. ఇది దేశంలోనే గ్రామాలకు స్వర్ణ యుగమని, ఆనాడు గాంధీ కలలు కంటే, ఈనాడు వాటిని నిజం చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్కే దక్కిందని తెలిపారు.