చండూరు: ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్రంలో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పే గంగా జమునా తెహజీబ్ మన తెలంగాణ జీవనమని ఆయన పేర్కొన్నారు. ఇవాళ చండూరులోని ఓ ఫంక్షన్ హాల్లో మునుగోడు నియోజకవర్గ ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. కొంతసేపు ముస్లిం సోదరులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.
అనంతరం మాట్లాడుతూ.. ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి 2008 నుంచి 2014 మద్య రూ.812 కోట్లు ఖర్చు చేస్తే, గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రూ.5,900 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ వక్ఫ్ బోర్డులో నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.53 కోట్ల గ్రాంటును ప్రభుత్వం అందించిందని మంత్రి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా, అకాడమీ నిర్వహణకు రూ.40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ మత సామరస్యం కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరని ఎర్రబెల్లి ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయిండని, అమ్ముడుపోయిన వ్యక్తికి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్, మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నేతలు, పలువురు ముస్లిం మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.