హైదరాబాద్ : రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ పండుగ సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ములకు అనురాగంతో చేతికి రాఖీ కట్టడం గొప్ప సాంప్రదాయమని మంత్రి అన్నారు. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన ఆత్మీయ పండుగ. రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజలలో సహోదరతత్వాన్ని మరింత పెంచుతుందని ఆయన ఆకాంక్షించారు.
అలాగే, అనాది నుంచి కొనసాగుతున్న ఈ గొప్ప పండుగ ఈ సారి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రావడం విశేషం అని మంత్రి అన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రక్షా బంధన్ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములై ఆత్మీయతతో పాటు జాతీయ స్ఫూర్తిని చాటాలని, ఈ రాఖీ పౌర్ణమి, స్వతంత్ర వేడుకలు ప్రజల మధ్య సంఘీభావాన్ని, మనమంతా ఒకటే అనే ఏకీభావాన్ని మరింతగా ఇనుమడింప చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు.