హైదరాబాద్ : శాసన మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు, తెలిపి అభినందించారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు.
చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనకు 30 ఏండ్లుగా తెలుసని, వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని, మూడు సార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారన్నారు. రెండుసార్లు శాసన మండలి చైర్మన్ గా ఏకగ్రీవం కావడం వారి ప్రతిభకు, సమర్థతకు నిదర్శనమన్నారు. ప్రజలతో మమేకమై, సుదీర్ఘ ప్రజాజీవితం గడుపుతూ, మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.