సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం పై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, బినెట్ సబ్ కమిటీ సభ్యుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లాలో సమీక్షనిర్వహించారు. జిల్లాలో 897 స్కూల్స్ ఉండగా, 316 స్కూల్స్ ని ఎంపిక చేశామని కలెక్టర్ వివరించగా, స్కూల్స్ ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? పథకం అమలు పై అధికారుల చర్యలేంటి? అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? వంటి పలు అంశాల పై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా సంబంధిత అధికారులు తాము తీసుకున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి పథకాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాల లో అన్ని సదుపాయాలు కల్పించాలని, ఆధునిక వసతులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పాత భవనాలను అధునికరించాలని, దాతల నుంచి నిధులు సేకరించాలని, వీటితో పాటు విద్యార్థుల సంఖ్య ను గణనీయంగా పెంచాలని కూడా మంత్రి సూచించారు. మంచి వాతావరణంలో నాణ్యమైన విద్య బోధన జరగాలని, ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పై ప్రజలు, ఆయా గ్రామాల పాఠశాలల పూర్వ విద్యార్థులకు, వ్యాపారులు, దాతలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు వంటి వాళ్ళందరికీ పూర్తి అవగాహన కలిగే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు.
జిల్లా పరిధిలో 5 నియోజకవర్గాలు ఉన్నాయని, ఆయా చోట్ల స్కూల్స్ ఎంపిక విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ విద్య మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, దాదాపు 7 వేల కోట్లతో స్కూల్స్ ని ఆధునికరించాలని సీఎం తలపెట్టారని మంత్రి అధికారులకు వివరించారు. స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య మీద దృష్టి పెట్టాలని, కేవలం ప్రభుత్వం పై ఆధార పడకుండా, పూర్వ విద్యార్థులు, దాతల ద్వారా నిధులు సేకరించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ విషయమై NRI లను కచ్చితంగా సంప్రదించాలి. వాళ్ళు ఇచ్చే నిధులను బట్టి ఆయా పాఠశాలల కు దాతల పేర్లు పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక్, మున్సిపల్ చైర్మన్ రామ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.