వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర నిధులతోనే పూర్తి చేశామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ, కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో మిషన్ భగీరథ అనేక అవార్డులు సాధించిన సందర్భంగా, ఆ శాఖకు చెందిన పలువురు ఇంజినీరింగ్, ఇతర అధికారులను మంత్రి దయాకర్ రావు ఘనంగా సన్మానించి, అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పరిశుభ్రమైన నీటిని అందించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఏ ముహుర్తాన మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాడో కానీ, అద్భుతమైన పథకాన్ని మొదలు పెట్టాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ఆకర్షితుడినై టీఆర్ఎస్ పార్టీలో చేరానని దయాకర్ రావు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ బాగా కష్టపడ్డారని పేర్కొన్నారు.
తాను ఈ శాఖకు మంత్రిగా వచ్చేసరికి, మిషన్ భగీరథ స్థిరీకరణ జరిగింది. ఇప్పుడు అద్భుత ఫలితాలు వచ్చాయి. ఇవాళ మనం ఆ ఫలితాలను అనుభవిస్తున్నాం. అందుకే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయని దయాకర్ రావు స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకాన్ని కాపీ చేసి, జల్ జీవన్ మిషన్ వంటి పలు పేర్లతో దేశంలో, వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బోర్ల నీటిని అందిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో వర్షను, భూ ఉపరితల నీటిని శుద్ధి చేసి అందిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, సీఎంఓ అధికారులు ప్రియాంక వర్గీస్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.