హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు జయశంకర్ సార్ మార్గదర్శిగా తోడ్పాటు అందించి సిద్ధాంత కర్తగా చరిత్రలో నిలిచిపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జయశంకర్ సార్ ఆకాంక్షలను, ఆశయాలను అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. జయశంకర్ సార్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. జయశంకర్ సార్ జయంతి, వర్ధంతిలను ఘనంగా నిర్వహించడం, ఆయన సేవలను స్మరించుకోవడం ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్లోని టీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆవరణలో జయశంకర్ సార్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రొఫెసర్గా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. 1952 లో జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమంలో, తర్వాత ఇడ్లీ, సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో, ఆ తర్వాత 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర సాధనకు వెన్నుదన్నుగా నిలిచారు. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్ అని మంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరవలేనిది అని దయాకర్ రావు స్పష్టం చేశారు.
నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త… తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయ శంకర్ సార్ జయంతి సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి. pic.twitter.com/gTszBnztgq
— Errabelli DayakarRao (@DayakarRao2019) August 6, 2022