హైదరాబాద్ : మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి పార్థివదేహానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జంగారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి దయాకర్ రావు ఓదార్చారు. జంగారెడ్డితో దయాకర్ రావు తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. జంగారెడ్డి నిబద్ధత కలిగిన నాయకుడు. బీజేపీలో సుదీర్ఘంగా కొనసాగారు. దేశంలో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే కలిగి ఉండగా, అందులో ఒకరు జంగారెడ్డి. ఆ సమయంలో హనుమకొండ నుండి ఆయన ఎంపీగా ఉన్నారు. ఒక పాత తరం ప్రజానాయకుడు, ప్రజల మనిషిని కోల్పోయాం. చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.