వరంగల్ : వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం కొత్త పెన్షన్దారులకు ఆయా పెన్షన్లను స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు కొత్త పెన్షన్దారులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సొంత గ్రామస్తులతో కాసేపు గడిపారు. గ్రామస్తులందరిని పేర్లు పెట్టి పిలుస్తూ, ఎలా ఉన్నారంటూ… వారి కుటుంబ యోగక్షేమాలు… బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. మంత్రి అందరితో కలిసిపోయి కాసేపు గడపడంతో పర్వతగిరి గ్రామస్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే అన్నట్లుగా, 40 ఏండ్లుగా వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధిగా ఉంటూ, మంత్రి అయ్యాక కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్దగా మారలేదని, తమని మరచి పోలేదని ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.