మహబూబాబాద్ : ప్రతి నిరుద్యోగి పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో 90 రోజుల పాటు నిర్వహించిన ఉచిత కోచింగ్ ముగింపు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అభ్యర్థులకు నోట్స్, కోచింగ్ మెటీరియల్ను పంపిణీ చేశారు.
పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు, పాలకుర్తి కేంద్రాలుగా గత కొన్నేళ్లుగా ఉచిత శిక్షణ ఇస్తున్నామని దయాకర్ రావు తెలిపారు. గతంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిలో వెయ్యి మందికి పైగా అనేక ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత.. ట్రస్ట్ చైర్పర్సన్ ఉషమ్మతో పాటు తనను కలిసినప్పుడు ఎనలేని సంతోషం కలుగుతుందన్నారు. మీరంతా ఉద్యోగాలు సాధించినప్పుడే తమ సేవకు అర్థం, పరమార్థం, సార్థకత ఉంటుందన్నారు. పట్టుదలతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. ఆ పట్టుదలతో తాను రాజకీయాల్లో 40 ఏండ్లుగా రాణిస్తున్నానని పేర్కొన్నారు. తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సేవలోనే ఉంటామని మంత్రి దయాకర్ రావు స్పష్టం చేశారు.