నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 2, 3వ వార్డులలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఒక్కో ఇంటికి వెళ్లి.. ఓటర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా వచ్చిన అభివృద్ధిని కూడా చేయలేకపోయారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కుడా ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
పైగా ఎన్నికలు ఏడాది కూడా లేని సమయంలో స్వార్థంతో కాంట్రాక్టుల కోసం, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఎన్నికలు తెచ్చిన వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని దయాకర్ రావు సూచించారు. మునుగోడులో పొరపాటున, బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది కాబట్టే మోటార్లకు మీటర్లు పెట్టలేదు. మీటర్లు పెట్టమని ప్రధాని మోదీతో బీజేపీ నేతలు స్టేట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే, ముందు ఆ పని చేసి, ఓట్లు అడగాలని దయాకర్ రావు సవాల్ విసిరారు.