Minister Errabelli Dayaker Rao | హైదరాబాద్ : హనుమకొండ జిల్లా( Hanumakonda dist ) కేంద్రంలో ఉన్న బాల వికాస( Balavikasa ) ప్రధాన కార్యాలయంలో ఇన్కం ట్యాక్స్( Income Tax ) అధికారులు దాడులు నిర్వహించారు. బాలవికాసపై ఐటీ దాడులను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గత 25 ఏండ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాల వికాసపై దాడులు బాధాకరం అని పేర్కొన్నారు. బాల వికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అవడం వల్లే ఈ ఐటీ దాడులు అని అన్నారు. ఈ ఐటీ దాడులు కక్ష్యసాధింపు చర్యలే అని అభిప్రాయపడ్డారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోంది అని ధ్వజమెత్తారు. ఇలాంటి దాడులతో బాల వికాస లాంటి సంస్థల నిస్వార్థ ప్రజా సేవలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తున్నది. భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా ఆ సంస్థ సేవలను ఆపగలమా? అని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.
హనుమకొండలోని ప్రధాన కార్యాలయంతో పాటు కీసరలో 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలు, సోమాజిగూడలోని కార్యాలయం, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు.