జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు బతుకమ్మను ఎత్తుకుని, మహిళలతో పాటు నడిచారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదలు పెట్టారని తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు.
ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో చీరలను అందిస్తున్నారు. బతుకమ్మ చీరల కోసం మొత్తం రూ. 339.73 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నలకు కూడా చేతి నిండా పని దొరికిందన్నారు. ప్రతి ఆడబిడ్డకు చీరను అందిస్తున్న సీఎం కేసీఆర్కు మంత్రి దయాకర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.