Errabelli Dayaker rao | సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ( Mission Bhagiratha )కు నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli Dayaker rao ) మండిపడ్డారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆయన నిలదీశారు. ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహించారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు ట్రయల్ రన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రూ. 1,212 కోట్లతో ఈ రిజర్వాయర్ పనులు చేపట్టామని తెలిపారు. 9 నియోజకవర్గాలోని 16 మున్సిపాలిటీలకు, 1,900 ఆవాసలకు తాగునీరు అందనుందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ దేశంలోనే తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తోంది. ఈ పథకాన్ని కేంద్రం అనేకసార్లు ప్రశంసిస్తూ, అవార్డుల మీద అవార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు చెప్పింది. కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు సహకరించదని మండిపడ్డారు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నది అని ధ్వజమెత్తారు. వర్షపు నీళ్లను ఫిల్టర్ చేసి ఇంటింటికి నీళ్లు ఇస్తే, ఇతర రాష్ట్రాల్లో ఇచ్చేది బోర్ల నీళ్లు అని గుర్తు చేశారు. మిషన్ భగీరథకు నిధులు ఇస్తామని కేంద్రం ఇవ్వకుండా మోసం చేసింది అని ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.