హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముస్లింలకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలు నీళ్లలా ప్రజలంతా మత, కుల, వర్గ బేధాలు లేకుండా పండుగలు జరుపుకుంటారని చెప్పారు.
తెలంగాణలో ప్రభుత్వమే పండుగలను నిర్వహిస్తోందని, సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలంతా కలిసి మెలసి జీవిస్తున్నారని తెలిపారు. అందరి శ్రేయోభిలాషిలా సీఎం ఆలోచిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ఆయన కోరుకున్నారు.